రామాయణము
రామాయణము ప్రాముఖ్యము
24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కధలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
- కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
- ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
- కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
- పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
- ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
- లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
- దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
- పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
- గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
- రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
- శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
- సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కధ
- మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
- యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.
- యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
- తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
- రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
- ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
తెలుగులో
రామాయణమును చాలా మంది కవులు తెలిగించినారు. వారిలో మొల్ల కవయిత్రి (మొల్ల రామాయణము ), కంకంటి పాపరాజు (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), విశ్వనాధ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), ఉషశ్రీ ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, కీర్తనలు, పాటలు, సినిమాలు, కథలు, పేర్లు, వూర్లు - చెప్పనవసరం లేదు. దాదాపు ఆంజనేయ స్వామి గుడి లేని వూరు అరుదు.తెలుగులో ఎందరో మహానుభావులు 'రామ'నామమును స్మరించి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులను, వాల్మీకిని స్తుతించి ప్రసిద్ధులైనారు. వారిలో ప్రధానముగా పోతన,మొల్ల, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, వాసుదాసస్వామి లను పేర్కొనవచ్చును.
ఈ వ్యాసము చివరలో రామాయణానికి సంబంధించి తెలుగునాట కొన్ని రచనలూ, మందిరాలూ, విషయాలూ ఇవ్వబడివి.
కావ్య విభాగములు, సంక్షిప్త కథ
రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. మొత్తము 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కధనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.- బాల కాండము (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
- అయోధ్యా కాండము (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
- అరణ్య కాండముు (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
- కిష్కింధ కాండము (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
- సుందర కాండము (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
- యుధ్ధ కాండము (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
- ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
ఇక్కడ ఒక్కొక్క కాండము కథ మాత్రము సంక్షిప్తముగా ఇవ్వబడినది. ఆయా కాండములకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలలో మరింత విస్తారంగా చెప్పబడింది.
|
బాలకాండము
రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.
కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరధుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరధుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.
రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగినది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిధిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తీ శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసినది.
మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.
అయోధ్యా కాండము
రాముని సవతి తల్లియైన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కాని ఆమె చెలికత్తె మంధర కైకేయి కి ఇలా నూరిపోసింది - "రాముడు రాజయితే కౌసల్య రాజమాతవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి, రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు.". ఈ మాటలు కైకేయి వంటబట్టాయి. అంతకు పూర్వము దశరధుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరధుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము.
దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో కృంగిపోయాడు. కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. అయోధ్యాపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గస్తుడైనాడు.
మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్ధించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించినది.
అరణ్యకాండము
శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు.
దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాపవిమోచనం పొందుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు మతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.
కిష్కింధకాండము
దస్త్రం:AN01028835 001 l.jpg
అడవిలో రామ లక్ష్మణులను చూచిన హనుమంతుడు.
హనుమంతుడు రామలక్ష్మణులను కలసి, సుగ్రీవునివద్దకుతోడ్కొని వెళ్ళాడు.రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిదుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు.
వారు అంతా కలయజూస్తూ, అనేక అవాంతరాలను అధిగమించి, స్వయంప్రభ అనే యోగిని సాయంతో దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఆపై దిక్కు తోచకవారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి, రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్ళాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్ధుడనీ, హనుమకు అసాధ్యమైన పని లేదనీ ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలిసికొన్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు.
సుందరకాండము
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోక వనం కనిపిస్తుంది .
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి. [ ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండము
అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉన్నది.
రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు హెచ్చరించారు. కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్దానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.
-
- జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
- రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు , మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారధిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్దానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. {{clear}
వాల్మీకి రామాయణము
బాలకాండ శ్లోకాలు: 61-70 (ప్రథమ సర్గ)
తతో వానర రాజేన వైరానుకధనం ప్రతి || ( 61)
రామునితో అగ్నిసాక్షిగా స్నేహమునకు అంగీకరించిన సుగ్రీవుడు, రాముడు చెప్పినదంతా విని, తనకు జరిగిన అన్యాయమును గురించి కూడా రామునికి చెప్పనారంభించెను. ( 61)
రామాయావేదితం సర్వం ప్రణయాదు:ఖితేన చ |
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి || (62)
తన సోదరుడైన వాలితో తనకు ఉన్న వైరము గురించి మొత్తం రామునకు సుగ్రీవుడు విన్నవించెను. ఈ వృత్తాంతం వినిన రాముడు, ఇన్ని దురాగతాలకు పాలుపడిన వాలిని వధించి సుగ్రీవునకు న్యాయము చేయుటకు ప్రతిజ్ఞ చేసెను. ( 62)
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానర: |
సుగ్రీవశ్శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే|| (63)
ఇట్లు ప్రతిజ్ఞ చేసిన రామునితో, అక్కడ ఉన్న వానర సైన్యం వాలి యొక్క బల ప్రతాపాలను గూర్చి వివరించుటనారంభించెను. సుగ్రీవుడు, రాముని ధైర్య సాహసాలను తెలుసుకున్నను, వాలితో యుద్ధమునకు రాముడు తగిన వాడేనాయని శంకించెను. (63)
రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే: కాయముత్తమం|
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం|| (64)
వాలియొక్క బలమును శ్రీ రామునకు నిరూపించుటకు సుగ్రీవుడు, రామునకు వాలి వధించిన దుందుభి అను రాక్షసుని కళేబరమును చూపించెను. ఆ కళేబరము చూచుటకు పర్వతమును పోలి ఉన్నది. (64)
ఉత్స్మయిత్వా మహాబాహు: ప్రేక్ష్య చాస్థిమహాబల: |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం|| (65)
ఆ కళేబరమును చూసిన రఘురాముడు, సుగ్రీవునివైపు మందహాసముతో చూచి, ఆ కళేబరమును తన కాలి బొతనివేలితో కొట్టెను. ఆ దెబ్బకు ఆ కళేబరము పది యోజనముల దూరమ్న పడెను. ఇది చూచిన తరువాత కూడా రామునిపై సుగ్రీవునకు నమ్మకము కుదరలేదు. ( 65)
బిభేద చ పున: సాలాన్ సప్తేకైన మహేషుణా|
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా|| (66)
సుగ్రీవుని నమ్మకమును పెంచుటకు, రాముడు, ఒకే ఒక్క బాణంతో ఏడు సాల వృక్షములను కొట్టెను. ఆ బాణము, వృక్షములను కొట్టుటయే కాక ఒక పర్వతములోనుంచి వెళ్ళి, పాతాళ లోకంలో దాకా వెళ్ళెను. (66)
తత: ప్రీతమనాస్తేన విశ్వస్త: స మహాకపి:|
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా|| (67)
రాముడు చేసిన పనిని చూసి సుగ్రీవుడు పొంగిపోయెను. రాముడీపైన తన నమ్మకం పెరిగెను. రాముని తో స్నేహము చేసినందుకు సంతోషించి, రామునితో కలిసి కిష్కింధలో తన గుహ దెగ్గరకు బయలుదేరెను. (67)
తతో గర్జత్ హరివర: సుగ్రీవో హేమపింగళ: |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వర: || (68)
బంగారము వంటి తేజస్సు కలిగినటువంటి సుగ్రీవుడు, కిష్కింధకు చేరగానే, గర్జన చేయుచూ, వాలిని పిలిచెను. వానర రాజైనటువంటి వాలి, తన గుహలొనుంచి బయటకి వచ్చెను. (68)
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగత: |
నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవ: || (69)
సుగ్రీవుని అరుపులు వినగానే, వాలి గుహనుంచి బయటకు బయలు దేరెను. కానీ,తన భార్య ఐన తార వాలిని వారించెను. సుగ్రీవుడు రామునితో వచి ఉండవచ్చునని, వరితో వైరం వాలికి మంచిది కాదు అని హెచ్చరించెను. వాలి తారను సముదాయించి, సుగ్రీవునితో యుద్ధము చేయనారంభించెను.ఆ యుద్ధము జరుగుతుండగా, వాలిని శ్రీ రాముడు ఒకే ఒక్క బాణముతో నిర్మూలించెను. (69)
తత: సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే|
సుగ్రీవ మేవ తద్రాజ్యే రాఘవ: ప్రత్యపాదయత్ || (70)
వాలిని వధించిన తరువాత, శ్రీ రామచంద్రుడు, సురీవుని మరలా కిష్కింధకు రాజుగా పట్టాభిషేకము చేసెను. (70)
బాలకాండ శ్లోకాలు: 56-60 (ప్రథమ సర్గ)
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణిం || (56)
వికృతమైన రూపం కలిగిన ఈ రాక్షసుడిని, అద్భుతమైన శక్తి గల రాముడు త్రుటిలో సంహరించెను. ఆ రాక్షసుడు, స్వర్గలోకాలకు వెడలిపోతూ, రామునితో ఇల చెప్పెను. " ఓ రామా, ఈ అరణ్యములోనే శబరి అనే ఒక గొప్ప తపస్విని ఉన్నది" (56)
శ్రమణిం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ|
సోభ్యగచ్చన్ మహాతేజా: శబరీం శత్రుసూదన: || (57)
శబరి గురించి చెప్తూ, " ఆ మహా సాధ్వి, సత్య, దయా ధర్మాలకు కట్టుబడినదియై, నిత్యమూ దైవ స్మరణముతో గడిపే మహాత్మురాలు. ఓ రామా, నీవు ఆమె ఆశ్రమానికి వెళ్ళు" అని చెప్పి, కబంధుడు అద్రుశ్యమైయ్యెను. ఈ మాటలను విన్న రామచంద్రుడు, లక్ష్మణునితో కలిసి శబరి ఆశ్రమానికి బయలిదేరెను. (57)
శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరథాత్మజ: |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ || (58)
దశరధాత్మజుడైన రామచంద్రుని రాక చూసి, ఆయనని ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసెను. ఆ పంపా నది సమీపంలోనే రామునికి హనుమంతునితో పరిచయమయ్యెను. (58)
హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత: |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబల: || (59)
హనుమంతుని ద్వారా రామ లక్ష్మణులకు సుగ్రీవునితో పరిచయమయ్యెను. రాముడు సుగ్రీవునికి, హనుమంతునికి తన గాధనంతా వర్ణించెను. (59)
ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషత: |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానర: || (60)
మోదటినుంచీ జరిగినదంతా వివరిస్తూ, సీతాపహరణమును వివరంగా వర్ణించెను. రాముడు చెప్పినదంతా సుగ్రీవుడు శ్రద్ధ గా విని, రామునితో స్నేహమునకు అంగీకరించెను. (60)
బాలకాండ శ్లోకాలు: 51-55 (ప్రథమ సర్గ)
అనాదృత్య తు తద్వాక్యం రావణ: కాలచోదిత: || (51)
"ఓ రావణా, రామునితో వైరము నీకు అంత మంచిది కాదు. రాముని ధైర్య సాహసాలను తక్కువ అంచనావేసి నీ పతనాన్ని కొనితెచ్చుకోకు. నీ సహోదరి ఐన శూర్పణఖ మాటలు విని రామునితో యుద్ధానికి వెళ్ళిన మన పదునాలుగువేల మంది రాక్షసులను రాముడు అవలీలగా హతమార్చాడు. రామునితో వైరము నీకు కూడా అదే పరిస్థితిని తెచ్చిపెడుతుంది." ఇంతగా రావణాసురుడిని హెచ్చరించినా, మారిచుని మాటలను పెడచెవిన పెట్టాడు రావణాసురుడు. (51)
జగామ సహమరీచ: తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ || (52)
ఇలా రావణుడు, మారీచుని వెంట పెట్టుకుని రాముని ఆశ్రమానికి వెళ్ళెను. అక్కడ, రాజ కుమారులైన రామ లక్ష్మణులను, మారీచుని మాయచేత అడవిలోనికి పంపివేసెను. (52)
జహార భార్యాం రామస్య
గృధ్రం హత్వా జటాయుషం |
గృధ్రం చ నిహతం దృష్ట్వా
హృతాం శ్రుత్వా చ మైథిలీం || (53)
రామ లక్ష్మణులను ఆశ్రమానికి దూరంగా పంపివేశాక, రావణాసురుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా, జటాయు రావణాసురుని బారినుండి సీతను కాపాడుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నంలో జటాయు తీవ్రంగా గాయపడెను. సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త రామచంద్రమూర్తి జటాయువు ద్వారా తెలుసుకొనెను. (53)
రఘవశ్శోకసంతప్తో విలలాపాకులేంద్రియ: |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం || (54)
సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త విని, రామచంద్రమూర్తి ఎంతో విలపించెను. తన ప్రాణానికి ప్రాణమైన భార్య తననుంచి దూరమైందన్న బాధతో రాముడు చాల విలపించెను. కొంత తేరుకున్న తరువాత, సీతను కాపాడుటకై ప్రయత్నించి తన ప్రాణాలను విడిచిపెట్టిన జటాయుకు రాముడు అంత్యక్రియలు చేసెను. (54)
మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ|
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం || (55)
జటాయువుకు అంత్యక్రియలు చేసిన పిమ్మట, రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అడవులలోకి వెళ్ళెను. ఇలా అడవులలో తిరుగుతుండగా ఒక ఘోరమైన రూపం కలిగిన కబంధుడనే రాక్షసుడిని రామ లక్ష్మణులు చూసెను. (55)
బాలకాండ శ్లోకాలు: 46-50 (ప్రథమ సర్గ)
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ || (46)
రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా, ఒకనాడు, జనస్థానంలో నివసించే కామరూపిణి ఐనటువంటి శూర్పణఖ అనబడే రాక్షసి, రాముడుని మోహించి వచ్చ్చినప్పుడు, తన తమ్ముడైన లక్ష్మణుడితో ఆ రాక్షసి ముక్కు, చెవులూ కోయించేసాడు శ్రీ రాముడు. (46)
తతశ్శూర్పణఖావాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం || (47)
శూర్పణఖకు ఇలా జరగగానే, తన అన్నలైన ఖర దూషణుల దెగ్గరకు వెళ్ళి, తనకు జరిగిన అవమానం గురించి చెప్పగా, వారు వారి దెగ్గర ఉన్న పదునాలుగువేల మంది రాక్షసులను రాముడిపైకి యుద్ధానికి పంపెను. (47)
నిజఘాన రణే రామ: తేషాం చైవ పదానుగాన్ |
వనే తస్మిన్ని వసతా జనస్థాన నివాసినాం || (48)
మొదటి పదునాలుగువేలమంది రాక్షసులను సమ్హరించిన రాముడు, తరువాత్ వరుసలో వచ్చిన ఖర, దూషణులను, వారి రాక్షస సైన్యంతో సహా రాముడు సమ్హరించెను. (48)
రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ |
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ: క్రోధమూర్చిత: || (49)
రాముడు, జనస్థానములో ఉన్నంత కాలము, ఖర, దూషణులతో కలిపి మొత్తం పదునాలుగు వేల మంది రాక్షసులను సమ్హరించెను. తన జ్ఞాతులైన ఖర దూషణుల మరణ వార్త విన్న రావణాసురుడు క్రోధాగ్నితో రగిలిపోయాడు. (49)
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం |
వార్యమాణస్సుబహుశో మారీచేన స రావణ: || (50)
క్రోధము పూనిన రావణాసురుడు, తన జ్ఞాతుల మరణానికి కారణమైనటువంటి వారిపై పగ సాధించవలెనని, మారీచుడు అనే రాక్షసుని సహాయమునకు వెళ్ళగా, అతడు రాముడితో వైరము రావణుడికి మంచిది కాదు అని వారించెను. (50)
బాలకాండ శ్లోకాలు: 41-45 (ప్రథమ సర్గ)
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ || (41)
దండకారణ్యములో ప్రవేశించిన తరువాత, విరాధుడు అనే రాక్షసుడిని రామచంద్రమూర్తి సంహరించారు. అటుపిమ్మట, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై శరభంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శించెను. (41)
సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా |
అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం || (42)
సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి, అటు పిమ్మట అగస్త్య మహర్షి ఆశ్రమానికి, అగస్త్య మహర్షి తమ్ముడి ఆశ్రమానికి కూడా వారు వెళ్ళెను. అగస్త్య మహర్షి, ఇంద్రుడు ఇచ్చిన ధనుస్సును రాముడుకి ఇచ్చెను. (42)
ఖడ్గం చ పరమప్రీత: తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైస్సహ || (43)
ధనుస్సుతో పాటు ఒక ఖడ్గము, ధనుస్సు కొశం అక్షయ బాణ తూణీరాలను కూడ ఇచ్చెను. ఆ తూణీరములలో బాణములు ఎన్నటికీ తరగవు. ఇలా శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ సమీపములో రాముడు నివసిస్తూ ఉండగా, అడవులలో నివసిస్తున్నవానప్రస్థులు రాముని వద్దకు వచ్చెను. (43)
ఋషయో భ్యాగమమ్ సర్వే వధాయాసుర రక్షసాం |
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే || (44)
వానప్రస్థులు రాముడి వద్దకు చేరి, వనాల్లో తిరుగుతూ వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని కోరగా, ఏ ఏ వనాలు రాక్షసుల వల్ల బాధపడుతున్నయో ఆ ఆడవులలో ఉన్న రాక్షసులందరినీ సంహరించటానికి రాముడు అంగీకరించెను. (44)
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధస్సంయతి రక్షసాం |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్య వాసినాం || (45)
అలా అంగీకరించిన రాముడు, అడవులలో ఉండి తపస్సు చేసుకుంటున్న మహా మునులందరిని, ఎవరైతే అగ్ని వంటి తేజస్సు కలిగి ఉన్నారో, వారిని వారి తేజస్సుతో రాక్షసులను నిర్మూలించమని అడిగెను. (45)
బాలకాండ శ్లోకాలు: 36-40 (ప్రథమ సర్గ)
రామోపి పరమోదార: సుముఖస్సుమహాయశా: || (36)
సహజ దానగుణ శీలుడు, ఉదార స్వభావుడైన రాముడితో భరతుడు అడవులకు వచ్చి " రామా, ఈ రాజ్యానికి నువ్వొక్కడివే రాజువి. ఈ రాజ్యము దశరథ మాహారాజు గారి తరవాత నీకే చెందుతుంది" అని అన్నాడు. (36)
న చైఛ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబల: |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పున: పున: || (37)
ఎంత బతిమిలాడినా, తన తండ్రి గారికి ఇచిన మాట కోసం రాజ్యాన్ని వొద్దు అను భరతునితో రాముడు చెప్పాడు. ఐనా భరతుడు రాజ్యాన్ని పాలించను అని అనగా, రాముడు, తన పాదుకలను భరతునకు ఇచి, వాటిని తన
స్థానం లో ఉంచమని చెప్పెను. (37)
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ: |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ || (38)
సింహాసనం మీద పాదుకలను ఉంచి రామాజ్ఞగా రాజ్యాన్ని పాలించమని భరతునకు చెప్పెను. భరతుడు, తన కోరిక తీరనందుకు బాధపడి, రామ పాదుకలకు నమస్కరించి, వాటిని తన శిరస్సున ధరించి బయలుదేరెను. (38)
నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ: || (39)
భరతుడు, అడావులను వదిలి వెళ్ళి, అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామములోనే నివసిస్తూ, రామ పాదుకలను రాజుగారి స్థానంలో ఉంచి, రామాజ్ఞగా రాజ్యాన్ని పాలిస్తూ, రాముడు ఎప్పుడు అయోధ్యకు తిరిగి వస్తాడో అని ఎదురుచూస్తూ ఉన్నాడు. (39)
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ || (40)
చిత్రకూటంలో రాముడు ఉన్న సంగతి భరతుడి వలన రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలిస్తే అందరు తన ఆశ్రమానికి వచ్చేస్తారని గ్రహించి, వాళ్ళు రాకపోయినా భరతుడే మళ్ళీ రావొచ్చని, తన ఆశ్రమాన్ని మర్చుకోవాలను నిర్ణయించుకున్నాడు. (40)
బాలకాండ శ్లోకాలు: 31-35 (ప్రథమ సర్గ)
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయ: || (31)
ఈ ప్రయాణంలో భరద్వాజుని ఈశ్రమము చేరుకుని, ఆయన ఆజ్ఞచే చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. ఆ పర్వతము మీద ఒక సుందరమైన కుటీరము లక్ష్మణుడు నిర్మించెను. అయోధ్యలో ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ కుటీరంలో కూడా అంతే ఆనందంగా రాముడు, సీతా, లక్ష్మణుడు ఆ ఆశ్రమం లో గడిపారు. (31)
దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్ నుఖం |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా || (32)
అమితోత్సాహంతో ఆ ముగ్గురు, ఆనందంగా ఆ కుటీరంలో గడుపుతున్నారు. ఐతే రాముడు అడవులకు వెడలిపోయాడని దశరథ మహారాజు పుత్రశోకంలో మునిగిపోయాడు. (32)
రాజా దశరథ: స్వర్గం జగామ విలపన్ సుతం |
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజై: || (33)
తన ప్రియ పుత్రుడైన రాముడు అడవులకు వెల్లిపోయాడని విలపించి దశరథ మహారాజు దు:ఖంతో శరీరాన్ని విడిచిపెట్టేశారు. తండ్రి గారు వెళ్ళిపొగానే, అన్నగారైన రాముడు కూడా లేనందున, రాజ్య భారమును వశిష్ఠాది మహర్షులు తమ్ముడైన భరతునకు అప్పగించారు. (33)
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల: |
స జగామ వనం వీరో రామపాదప్రసాదక: || (34)
భరతుడు, రాజ్యాన్ని పాలించడానికి తగిన సమర్ధత కలిగినవడైనప్పటికి, తన అగ్రజుడైన రాముడు లేని రాజ్యం తనకు అఖ్ఖరలేదు అని వశిశ్ఠాదులకు చెప్పి, అన్నగారైనటువంటి రాముడితో ఉండటానికి అడవులకు బయలుదేరాడు. (34)
గత్వా తు స మాహాత్మానం రామం సత్యపరాక్రమం |
అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత: || (35)
భరతుడు అడవులకు చేరుకుని, సత్యపరాక్రమవంతుడైన రాముడి పాదాలచెంత చేరి, ఇలా ప్రాధేయపడుతునాడు. (35)
No comments:
Post a Comment